గుంటూరు, సెప్టెంబర్ 11:– గర్భాశయ ముఖద్వార క్యాన్సర్పై మహిళల్లో అవగాహన పెంచడంతో పాటు వ్యాధిని ముందస్తు దశలో గుర్తించి నివారించేందుకు గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గా ప్రసాద్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు సంబంధించిన ముందస్తు లక్షణాలు, వ్యాధి నివారణ, క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాల్సిన ఆవశ్యకతపై ర్యాలీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే సమర్థవంతంగా చికిత్స అందించే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు.Guntur city news
ప్రసూతి, గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ అరుణ వేము, డాక్టర్ శివ రంజని, డాక్టర్ వెంకారెడ్డి, డాక్టర్ జ్యోతుల మురళీకృష్ణతో పాటు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, వైద్య విద్యార్థులు, ఇతర ఆరోగ్య సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు.
క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్కు దారితీసే ముందస్తు మార్పులను గుర్తించి తగిన సమయంలో చికిత్స అందించవచ్చని వైద్యులు వివరించారు. అలాగే హెచ్పీవీ (HPV) టీకా, హెచ్పీవీ సంక్రమణ నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
16న స్క్రీనింగ్ క్యాంప్
అవగాహన కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 16న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించనున్నారు. గుంటూరులోని నాట్కో ఇన్వెస్టిగేషన్ బ్లాక్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్యాంప్ కొనసాగనుంది. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని నిర్వాహకులు కోరారు.
“స్క్రీనింగ్ చేయించుకోండి.. క్యాన్సర్ను ముందుగానే గుర్తించండి.. ఆరోగ్యకరమైన భవిష్యత్తును కాపాడుకోండి” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కార్యక్రమాన్ని ప్రసూతి, స్త్రీ వ్యాధుల విభాగం, ఆంకాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, పాథాలజీ విభాగాలు సంయుక్తంగా నిర్వహించాయి.



