GUNTUR CITY NEWS: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో గుంటూరును అగ్రపథాన నిలుపుదాం: కమిషనర్

Karthik

గుంటూరు నగరం ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ‘సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీ’ కేటగిరీలో అత్యుత్తమ ర్యాంకును కలిగి ఉందని, ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో సమిష్టిగా కృషి చేసి జిఎంసిని దేశంలోనే మెరుగైన స్థానంలో నిలబెట్టాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ పిలుపునిచ్చారు. మంగళవారం స్తానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రజారోగ్య అధికారులు మరియు సచివాలయ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో కమిషనర్ పారిశుధ్య నిర్వహణపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వచ్చతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారంటే దానికి ఎంత ప్రాధ్యాన్యత ఉందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. స్వచ్చ సర్వేక్షణ్ లో ర్యాంక్ కోసమే కాదని, నగర ప్రజలకు మెరుగైన ఆరోగ్య రక్షణలో పారిశుధ్యం ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రతి వార్డు సచివాలయం పరిధిలో పారిశుధ్యం మెరుగుపడాలని, ముఖ్యంగా డ్రైన్ల క్లీనింగ్ మరియు నిర్మాణ వ్యర్థాల తొలగింపు వంటి పనులు నిరంతరం జరుగుతూ ‘విజిబుల్ క్లీనింగ్’ కంటికి కనిపించాలని స్పష్టం చేశారు. నగరంలో పారిశుధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా, ప్రతి ఇంట్లోనే అంటే సోర్స్ వద్దే తడి, పొడి చెత్తను వేరు చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. హోమ్ కంపోస్ట్ తయారీని ప్రోత్సహించడంతో పాటు, నగరంలో ఏర్పాటు చేసిన ఆర్ఆర్ఆర్ సెంటర్లు పక్కాగా పనిచేసేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఖాళీ స్థలాల్లో చెత్త ఉండడానికి వీలు లేదని, యజమానులే శుభ్రం చేసుకోవాలని లేకుంటే నోటీసులు ఇచ్చి అపరాధ రుసుం విధించాలన్నారు. మేజర్ డ్రైన్ కల్వర్ట్ లు, మెష్ ల వద్ద వ్యర్ధాలను నాల మెషిన్స్ ద్వారా ప్రతి రోజు శుభ్రం చేయించాలన్నారు. అంతర్గత డ్రైన్లను గ్యాంగ్ వర్క్ లో శుభ్రం చేయించాలన్నారు. త్వరలో ఈ-ఆటోలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు సాధించడమే లక్ష్యంగా క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, పారిశుధ్య విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు.సమావేశంలో సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, ఎస్ఎస్ లు సోమశేఖర్, ఆయూబ్ ఖాన్, రాజేష్, సాంబయ్య, ఐజాక్, ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Author
Total Views: 0
Share This Article
Leave a review