GUNTUR DISTRICT NEWS: డీజిల్ కోసం ఆందోళన అవసరం లేదు – సరిపడా నిలువలు ఉన్నాయి

Karthik

జిల్లాలో సరిపడా నిలువలు ఉన్నాయని, డీజిల్ కోసం ఆందోళన అవసరం లేదని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ స్పష్టం చేశారు. జిల్లాలో ఇంధన సమస్యపై వస్తున్న వార్తల పట్ల సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ వివరించారు. నగరం పాలెం భారత్ పెట్రోల్ బంకును, వెంకటప్పయ్య కాలనీ లోని  హెచ్.పి పెట్రోల్ బంకును స్వయంగా తనిఖీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ప్రజలకు అవసరమైన మేరకు ఇంధన సరఫరా నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు అపోహలకు లోనుకావద్దని కోరారు. పెట్రోల్ బంకుల్లో సరఫరా వ్యవస్థను పర్యవేక్షిస్తూ ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు. జిల్లాలో సరాసరిన రోజుకు 450 నుండి ఐదు వందల కిలో లీటర్ల విక్రయాలు జరుగుతాయని, అయితే గత రెండు రోజులుగా రోజుకు ఏడు వందల నుండి ఎనిమిది వందల కిలో లీటర్ల విక్రయాలు జరిగాయని తెలిపారు. వెయ్యి కిలో లీటర్ల డీజిల్, ఏడు వందల కిలో లీటర్ల పెట్రోల్ సోమవారం నాటికి హెచ్.పి.సి.ఎల్, ఐ.ఓ.సి.ఎల్, బి.పి.సి.ఎల్ కంపెనీల నుండి సరఫరా అయిందన్నారు. ఆదివారం నాటికి డ్రై అవుట్ అని 85 బంకులు బోర్డులు పెట్టినట్లు గమనించడం జరిగిందని, అన్ని బంకులకు ఇంధనం సరఫరా చేయడం జరిగిందని, సాయంత్రం 6 గంటల వరకు 49 బంకులలో డ్రై అవుట్ పరిస్థితి ఉందని, రెండు, మూడు గంటలలో వాటికి కూడా సరఫరా అయ్యేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈ అంశంలో ప్రత్యేక చొరవతో పనిచేస్తూ, ఆదేశాలు జారీ చేస్తున్నారని అన్నారు. మంగళ వారం ఉదయం నాటికి అన్ని బంకులు పూర్తి స్థాయిలో పని చేయుటకు కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా సమస్యలు ఉంటే ఆయిల్ కంపెనీ వారిని సంప్రదించి స్టాక్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి బంక్ వద్ద ఒక రెవిన్యూ ఉద్యోగిని, ఒక పోలీసు కానిస్టేబుల్ ను నియమించి పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు.  జాయింట్ కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ ఆకస్మిక తనిఖీలు చేసి పరిశీలించడం జరిగిందన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. బంకులలో నిల్వలను అనుసరించి ముందుగా ఇండెంట్ లు పెట్టీ ఇంధనం సరఫరా అయ్యేటట్లు చూస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎంత అవసరమో అంతే కొనుగోలు చేయాలని, భయాందోళనలతో అధికంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రైతులకు, అత్యవసర సేవలకు ఇంధనం పంపిణీలో ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశామని చెప్పారు. కనిష్ట నిలువలు ఉన్నా విక్రయాలు చేయాలని బంకులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. *సోషల్ మీడియాలో కథనాలపై నిఘా*సోషల్ మీడియాలో వచ్చే కథనాల పట్ల నిఘా పెట్టడం జరిగిందని వివరించారు. వచ్చిన పోస్టులను పోలీసు సూపరింటెండెంట్ కు పంపించామని, తక్షణ చర్యలకు ఉపక్రమించడం జరిగిందని చెప్పారు. పోలీసు సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ మాట్లాడుతూ భయంతో కొనుగోలు వద్దని కోరారు.

Author
Total Views: 0
Share This Article
Leave a review