జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. జిల్లాలో డీజిల్ కొరతపై వస్తున్న వదంతులపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు అవసరమైన మేరకు ఇంధన సరఫరా నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో డీజిల్ కొరతపై వస్తున్న ప్రచారం నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు లోనవుతూ పెట్రోల్ బంకుల వద్ద అధిక సంఖ్యలో చేరుతున్నారని పేర్కొన్నారు. అవసరం లేకపోయినా డీజిల్ను నిల్వ చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల అనవసర రద్దీ ఏర్పడుతోందని చెప్పారు. ప్రజలు అపోహలకు లోనుకాకుండా, సాధారణ అవసరాలకు మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని సూచించారు. పెట్రోల్ బంకుల్లో సరఫరా వ్యవస్థను పర్యవేక్షిస్తూ ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు. ఇంధన కొరతపై వస్తున్న వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో 195 బంకులు ఉండగా 12 బంకులలో పెట్రోలు స్టాక్, 70 బంకులలో డిజిల్ స్టాక్ కొరత ఉందని, మిగిలిన బంకులలో ఎలాంటి ఇబ్బంది లేదని వివరించారు. వదంతులు నమ్మి ప్రజలు అధికంగా కొనుగోలు చేయడం కారణంగా బంకులలో కొంతమేర కొరత ఏర్పడిందని, ఆదివారం అయినప్పటికీ పెట్రోల్ కంపెనీల వారితో మాట్లాడి, సదరు బంకులలో ఆదివారం లేదా సోమవారం ఉదయం లోగా పూర్తి స్థాయిలో డీజిల్ అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొండపల్లి స్టాక్ పాయింట్ నుండి ఐ.ఓ.సి.ఎల్, బి.పి.సి.ఎల్ బంక్ లకు ఆదివారం కారణంగా సరఫరా కాకపోవడం ఒక కారణం అన్నారు. జిల్లాలో ఎక్కడైనా సమస్యలు ఉంటే ఆయిల్ కంపెనీ వారిని సంప్రదించి స్టాక్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కొంత మంది క్యానులు, డ్రమ్ములలో డీజిల్ కొనుగోలు చేస్తున్నారని, అటువంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. కార్ల యజమానులు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న అవాస్తవాలతో ఆందోళన చెంది ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారని చెప్పారు. జిల్లాలో సరాసరిన 450 కిలో లీటర్ల విక్రయాలు ఉండగా, శనివారం ఒక్క రోజు ఏడు వందల కిలో లీటర్ల విక్రయాలు జరిగాయని తెలిపారు. శనివారం 810 కిలో లీటర్ల డీజిల్ సరఫరా చేశారని చెప్పారు. ఇంధన కంపెనీలతో ప్రతి రోజూ రెండు సార్లు సంప్రదిస్తున్నామని, ప్రతి బంక్ వద్ద ఒక ఉద్యోగిని నియమించి పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. ఎలక్ట్రికల్ వాహనాల రీఛార్జింగ్ కు అధికంగా మొత్తాలను వసూలు చేస్తే ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో 50 వేల ఎల్.పి.జి సిలిండర్ల డెలివరీ పెండింగ్ లో ఉందని, కొద్ది రోజులలో సరఫరా చేస్తామని చెప్పారు. జిల్లాలో పెట్రోలు, డీజిలు కొరత ఏర్పడనున్నదని అవాస్తవాలను సోషల్ మీడియా ద్వారా వ్యాపింపజేసి, ప్రజలను ఆందోళనకు గురి చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాపై నిఘా పెట్టామని చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ చెప్పారు. డీజిల్, పెట్రోల్ కొరతపై సమాచారం ఉంటే కంట్రోల్ రూమ్ ఫోన్ – 7780675354 కు తెలియజేయవచ్చని అన్నారు.



