విశాఖపట్నం, జూన్ 14 :– విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)తో పాటు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. ఈ కార్యక్రమాలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరగనున్నాయని వెల్లడించారు.
ఈ సమావేశాలకు రెవెన్యూ శాఖ అధికారులతో పాటు అన్ని శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు హాజరవుతారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను పూర్తి వివరాలతో సమర్పించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిన ‘మీ కోసం’ కాల్ సెంటర్ 1100 సేవలు మరియు Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
ఇప్పటివరకు వివిధ శాఖలకు అందిన ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. సంబంధిత అధికారులు అవసరమైన నివేదికలతో నిర్ణీత సమయానికి హాజరై సమీక్షలో పాల్గొనాలని అధికారిక ప్రకటన ద్వారా ఆదేశించారు.



