విజయవాడ: ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడం, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే ప్రజా దర్బార్ ప్రధాన ఉద్దేశమని మాజీ కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్ తెలిపారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు.
ప్రజా దర్బార్లో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు మహాదేవు అప్పాజీరావు, మహ్మద్ అబ్దుల్ ఖాదర్, 52వ డివిజన్ బీజేపీ ఇన్చార్జి అడ్డూరి భాస్కరరావు, 42వ డివిజన్ జనసేన అధ్యక్షుడు పులిచేరి రమేష్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
ప్రజలు ఇళ్ల స్థలాలు, పింఛన్లు, వైద్య సహాయం, రేషన్ కార్డులు, స్థానిక మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై వినతులు సమర్పించారు. వాటిలో చాలావరకు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా, మిగిలిన వాటిని సంబంధిత శాఖల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా మరుపిళ్ల రాజేష్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి నేరుగా తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజా దర్బార్ల ద్వారా ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. అర్హులైన పేదలందరికీ త్వరలోనే నూతన ఇళ్ల పట్టాలు, సొంతింటి స్థలాలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ షర్మిల, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు, బీజేపీ నాయకులు దుర్బేసుల హుస్సేన్, రుద్రపాటి వెంకటేష్ తదితరులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.



