GUNTUR DISTRICT NEWS: స్పోర్ట్స్ కోటా నియామకాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి: జన చైతన్య వేదిక

Karthik

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మెగా డియస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించకుండా కేవలం క్రీడల సర్టిఫికెట్ల ఆధారంగా ఉపాధ్యాయులుగా నియమించిన 382 నియామకాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని, డియస్సీ నియామకాల అవకతవకలపై సిబిఐ విచారణ చేపట్టాలని ఈనెల 7వ తేదీన ఆదివారం ఉదయం గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో నీట్ పరీక్ష, సిబియస్ఇ పరీక్షల మూల్యాంకనం, డియస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలపై జరిగిన చర్చా గోష్టిలో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఈ చర్చా గోష్టికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. మాజీ మంత్రివర్యులు, వైకాపా సీనియర్ నాయకులు అంబటి రాంబాబు ప్రసంగిస్తూ స్పోర్ట్స్ కోటాలో అభ్యర్థులు ఎలాంటి పరీక్షలు రాయవలసిన అవసరం లేదని, కేవలం క్రీడా సర్టిఫికెట్ల ఆధారంగా ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతోనే కుట్ర ప్రారంభమైందని, డబ్బులు చేతులు మారినాయని ఆరోపించారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైనాయని, నేరాలు చేస్తే శిక్షలు ఉంటాయనే నమ్మకాన్ని ప్రజలు కోల్పోయినారని అన్నారు. డియస్సీ నియామకాలలో అవకతవకలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై సమాధానాలు చెప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలను భయపెడుతూ, అరెస్టులు చేస్తామని పేర్కొనడాన్ని తప్పు పట్టారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ సార్ధక్ సిద్ధాంత, వేదాంత శ్రీ వాత్సవ, నిసర్గ అధికారి లాంటి యువ విద్యార్థులు సిబిఎస్ఇ మూల్యాంకనం లో జరిగిన అవకతవకలను దేశ ప్రజల దృష్టికి తెచ్చినారన్నారు. 2019లో తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వివాదంలో ప్రధాన పాత్ర పోషించిన గ్లోబరీనా సంస్థ ఫలితంగా 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అదే సంస్థ అధిపతి వి.ఎస్.ఎన్. రాజు గ్లోబరీనా పేరు మార్చి కో ఎంప్ట్ ఎడ్యుటెక్ గా రూపాంతరం చెంది సిబిఎస్ఇ మూల్యాంకనం టెండర్ ను దక్కించుకొని 18 లక్షల మంది 12 వ తరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడినారన్నారు. నీట్ యుజి పరీక్ష పత్రాలు 2021, 2024, 2026 లలో లీకైనాయని దాదాపు 60 లక్షల మంది విద్యార్థులకు నష్టం కలిగించినారని, వీటికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల పేపర్లు లీకవుతున్నాయని, ఉద్యోగ నియామక ప్రక్రియ కూడా లోప భూయిష్టంగా జరుగుతుందన్నారు. తత్ ఫలితంగా విద్యార్థుల, యువత ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. యువత చైతన్యవంతులై కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపునందుకొని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన తెలిపినారని, పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని కోరడాన్ని సమర్థించారు. ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి.ఎ.ఆర్. సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు కో ఎంప్ట్ ఎడ్యుటెక్ టెండర్ దక్కించుకోవడానికి టెండర్ లో 3సార్లు మార్పులు చేసి, ప్రసిద్ధిగాంచిన టిసిఎస్ సంస్థను తప్పించి సిబిఎస్ఇ మూల్యాంకనం లో ఘోరమైన తప్పులు జరగడానికి కారణమైందని వివరించారు. డియస్సి రాత పరీక్ష రాయకుండా కేవలం క్రీడా సర్టిఫికెట్లతో ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందిన 382 మంది ఏ విధంగా లెక్కలు, సైన్స్, ఇంగ్లీషు ఇలాంటి సబ్జెక్టులను బోధిస్తారని ప్రశ్నించారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జిడి ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్ర సాయుధ రక్షక దళాలలో కానిస్టేబుల్ ఉద్యోగుల భర్తీ కోసం జరిగిన జాతీయస్థాయి పరీక్షలలో కూడా అవకతవకలు జరిగినాయి అని తెలిపారు. చర్చా గోష్టి లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు ఎ.వి. పటేల్ ప్రసంగిస్తూ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు నిజాయితీగా పనిచేయకపోవడం వల్లనే ఇలాంటి లీకేజి సమస్యలు ఉత్తన్నమౌతున్నాయన్నా రు. ఏపీ జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్టు సిహెచ్.కృష్ణాంజనేయులు ప్రసంగిస్తూ యస్ సి ఇ ఆర్ టి లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తూ డియస్సీ ప్రశ్నాపత్రం రూపకల్పనలో భాగస్వామిగా ఉండి డియస్సీ పరీక్ష రాసి మొదటి ర్యాంక్ సాధించినాడని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించలేదన్నారు. ఈ చర్చా గోష్టి లో ఏసీ కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ పి. ముత్యం, సైకాలజిస్ట్ అడపా వేణుగోపాల్, ప్రముఖ న్యాయవాది, విశ్లేషకులు కన్నా రజిని, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ విశ్రాంత జనరల్ మేనేజర్ పి. వీరారెడ్డి తదితరులు ప్రసంగించారు.

Author
Share This Article
Leave a review