గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న ఢిల్లీ విజ్ఞాన విహారయాత్ర విద్యార్థుల జీవితాల్లో చిరస్మరణీయ అనుభూతిగా మారింది. పదవ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థిని, విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రత్యేకంగా ఈ విద్యా విహారయాత్రను ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో భాగంగా విద్యార్థులు దేశ అత్యున్నత గౌరవనీయ స్థలమైన రాష్ట్రపతి భవన్ ను సందర్శించారు. భారత రాష్ట్రపతి అధికార నివాసమైన రాష్ట్రపతి భవన్ యొక్క వైభవం, చారిత్రక ప్రాధాన్యం, నిర్మాణ శైలి గురించి విద్యార్థులు ఆసక్తిగా తెలుసుకున్నారు. దేశ పరిపాలనా వ్యవస్థ, రాజ్యాంగ విలువలు, జాతీయ నాయకత్వంపై విద్యార్థులకు అవగాహన పెరిగేలా ఈ సందర్శన ఎంతో ఉపయోగపడింది.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా పెద్ద లక్ష్యాలు సాధించగలరనే నమ్మకాన్ని కలిగించే విధంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. గ్రామీణ మరియు సాధారణ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు విమాన ప్రయాణం, దేశ రాజధాని ఢిల్లీ సందర్శన, జాతీయ ప్రాధాన్య కట్టడాల వీక్షణ వంటి అరుదైన అవకాశాలను కల్పించడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ…“ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ ఉంది. వారికి సరైన ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే దేశ స్థాయిలో రాణించగలరు. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను మరింత ప్రోత్సహించడం నా బాధ్యతగా భావిస్తున్నాను. భవిష్యత్తులో కూడా విద్యార్థుల అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తాము” అని తెలిపారు. విద్యార్థులు కూడా తమ జీవితంలో ఇది మరపురాని అనుభవమని పేర్కొంటూ, తమపై విశ్వాసం ఉంచి ఢిల్లీ విజ్ఞాన విహారయాత్రకు తీసుకువచ్చిన ఎమ్మెల్యే గళ్ళా మాధవికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, దేశభక్తి, ఉన్నత లక్ష్యాల పట్ల ఆసక్తి పెంపొందించడం జరిగిందని పలువురు అభిప్రాయపడ్డారు.



