ప్రజలు స్వీయ గణనలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ కోరారు. జనాభా గణనపై ప్రజల్లో అవగాహనలోభాగంగా ఆదివారం “సెన్సస్ 5 కె రన్” ను జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి కమిషనర్ ప్రారంభించారు. “సెన్సస్ 5 కె రన్” హిందూ కాలేజీ కూడలి వరకు జరిగింది. స్వీయ గణన నినాదాలతో రన్పెద్ద ఎత్తున సాగింది. స్వీయ గణన సదుపాయంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యమై వాస్తవ వివరాలు పొందుపరచుటకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు స్వీయ గణన అందుబాటులో ఉంటుందన్నారు. స్వీయ గణన ద్వారా సమర్పించిన వివరాలను సంబంధిత ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ధృవీకరిస్తారని స్పష్టం చేశారు. డిజిటల్ విధానంలో స్వీయ గణన చేసుకోవడం వలన మే ఒకటో తేదీ నుండి ఇంటింటికి జరిగే జనాభా లెక్కల సేకరణ సులభతరం అవుతుందని అన్నారు.



