సౌత్ ఇండియన్ ఫస్ట్ ఎయిడర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ నూతన లోగోను ఆవిష్కరించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వీ , డాక్టర్ లోక్ నాధ్ ముఖ్య అతిథిగా హాజరై నూతన లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు సాంబశివరావు, గోవిందరాజులు, అమర్ రెడ్డి, నిర్గుణబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందించడంలో గ్రామీణ వైద్యుల పాత్ర ఎంతో ఉందని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. అయితే గతంలో ఆర్.ఎం.పీ, పీ.ఎం.పీ లకు తగిన విధంగా గుర్తింపు ఇచ్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ప్రయత్నం మరువలేనిది అని చెప్పారు. వైఎస్సార్ మరణానంతరం గ్రామీణ వైద్యులకు గుర్తింపు ఇచ్చే ప్రక్రియ మరుగున పడిపోయిందని అన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి గ్రామీణ వైద్యుల సేవలను గుర్తించి తగిన విధంగా గుర్తింపు ఇవ్వాలని కోరారు. గ్రామీణ వైద్యులు కూడా మరింత నైపుణ్యం పెంచుకుని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.



