GUNTUR CITY NEWS: జన గణన ను విజయవంతం చేయాలి

Karthik

జనాభా గణన 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రజలు ఇచ్చే వ్యక్తిగత సమాచారం చాలా సురక్షితంగా ఉంటుందని, ఎటువంటి అపోహలకు గురికావద్దని, జన గణనపై సందేహాలకు జిఎంసి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు పని చేసేలా కాల్ సెంటర్ 0863-2345105 ఏర్పాటు చేశామని గుంటూరు నగర ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి మరియు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 3 చార్జీల్లో (3 నియోజకవర్గాలు) 18,088 కుటుంబాలు స్వీయ గణనలో వివరాలు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. జనాభా గణన పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతోందని, నగరంలో 1310 హౌస్ లిస్టింగ్ బ్లాక్ లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. దీనికోసం 1272 మంది ఎన్యుమరేటర్లను, 201 సూపర్వైజర్లను, ముగ్గురు ఛార్జ్ అధికారులను నియమించామన్నారు. విధులు కేటాయించబడిన అందరికీ శిక్షణ పూర్తి చేయడంతో పాటు ఎన్యుమరేటర్లకు అవసరమయ్యే కిట్లు పంపిణీ జరిగిందని, వారు అంకితభావంతో పనిచేసి సరైన డేటాను సేకరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్యుమరేటర్లు మే 1వ తేదీన తమకు కేటాయించిన ఇళ్లకు సంబంధించి హద్దులు సరిచూసుకుని, మే 30వ తేదీ వరకు ప్రతి ఇంటినీ సందర్శించి మ్యాప్ ఆధారంగా సరిహద్దులను గుర్తించి మొబైల్ యాప్‌లో వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. జనాభా గణన ప్రారంభించే ముందు ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన ప్రాంతం లే అవుట్‌ను సిద్ధం చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. స్వీయ గణనకు ఏప్రిల్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అవకాశం కల్పించగా, ఇళ్ల గణన మే 1వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు వారి ఐడీ కార్డులను పరిశీలించి వివరాలు తెలియజేయాలని సూచించారు. ప్రజలు ఇచ్చే వ్యక్తిగత సమాచారం చాలా సురక్షితంగా ఉంటుందని, సరైన సమాచారం ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన తదితర ప్రణాళికలు రూపొందించడానికి వీలవుతుందన్నారు. స్వీయ నమోదు చేసుకున్న వారు జనగణనకు వచ్చే సిబ్బందికి తమ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడిని తెలపాలని సూచించారు.

Author
Share This Article
Leave a review