గుడివాడ, ఆగస్టు 20:– గుడివాడ–విజయవాడ ప్రధాన రహదారిలో ఇటీవల దెబ్బతిన్న కల్వర్టును పునర్నిర్మించేందుకు రూ.16 లక్షల వ్యయంతో చేపట్టిన RCC కల్వర్టు నిర్మాణ పనులను గుడివాడ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ ఎస్. మనోహర్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా పనుల పురోగతిని పరిశీలించిన కమిషనర్.. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ను ఆదేశించారు. పనుల కారణంగా ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
కల్వర్టు పునర్నిర్మాణ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ స్పష్టం చేశారు. పనులు పూర్తయిన అనంతరం గుడివాడ–విజయవాడ ప్రధాన మార్గంలో రాకపోకలు మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా సాగుతాయని తెలిపారు.
పరిశీలనలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివాజీ, అసిస్టెంట్ ఇంజనీర్లు రాజేష్, శివాజీ, సంబంధిత కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.



