CHINTALAPUDI
వెల్ఫేర్ అసిస్టెంట్లతో జిల్లా అధికారి జి. వెంకట్ నాయుడు సమీక్ష
CITY NEWS TELUGU | CHINTALAPUDI: ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ కార్యక్రమంపై స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు జిల్లా అధికారి జి. వెంకట్ నాయుడు వెల్ఫేర్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం అమలులో చేపట్టాల్సిన చర్యలు, అర్హులైన లబ్ధిదారుల వివరాల నమోదు, పెండింగ్ సమస్యల పరిష్కారంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం ప్రయోజనం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
బ్యాంకు ఖాతాలు ఆధార్తో అనుసంధానం కాకపోవడం, తల్లి, విద్యార్థుల వివరాలు వేర్వేరు కుటుంబాల రికార్డుల్లో ఉండటం, ఆధార్ సంబంధిత సమస్యల కారణంగా కొన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వెంకట్ నాయుడు తెలిపారు. అటువంటి సమస్యలను గుర్తించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.sricitynetworks.com
అలాగే ఈ-కేవైసీ, ఆధార్ నూతన నమోదు, ఐదేళ్లు పూర్తయిన చిన్నారులకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేషన్ తదితర కార్యక్రమాల పురోగతిని కూడా సమీక్షించినట్లు తెలిపారు.
అనంతరం పంచాయతీ కార్యదర్శులతో స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంపై ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.



