ఏలూరు, సెప్టెంబర్ 18:– ఏలూరు నగరంలోని ఎన్ఎస్ కూరగాయల మార్కెట్లో శ్రీ జలాపహరేశ్వర కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి వార్షికోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం మహిళా భక్తులు పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తపన ఫౌండేషన్ అధినేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు ఉత్సవ ప్రాంగణానికి హాజరై శ్రీ లక్ష్మీ గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు.Eluru City news
మండపానికి చేరుకున్న వారికి ఉత్సవ కమిటీ సభ్యులు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువాలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా గారపాటి సీతారామాంజనేయ చౌదరి, రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఎన్ఎస్ కూరగాయల మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. శ్రీ లక్ష్మీ గణపతి ఆశీస్సులు ఏలూరు నగర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు.
కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, ఎన్ఎస్ కూరగాయల వర్తక సంఘం ప్రతినిధులు, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



