ఏలూరు, సెప్టెంబర్ 18:– విజయవాడ బాలోత్సవ భవన్లో ఈ నెల 20న నిర్వహించనున్న సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కమిటీ సభ్యురాలు, గోదావరి లోయ ప్రతిఘటన ఉద్యమ సీనియర్ నాయకురాలు గంగసాని సరోజిని అలియాస్ కామ్రేడ్ సీతక్క సంతాప సభను జయప్రదం చేయాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఏలూరు కార్యదర్శి బద్దా వెంకట్రావు పిలుపునిచ్చారు.
సంతాప సభకు ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు, రైతులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరుతూ శుక్రవారం ఏలూరు వన్టౌన్ రైతు బజార్ వద్ద ఐఎఫ్టీయూ అనుబంధ హమాలీ ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బద్దా వెంకట్రావు మాట్లాడుతూ సీతక్క తన జీవితాంతం పేద ప్రజల విముక్తి కోసం, గోదావరి లోయలోని ఆదివాసీ, గిరిజన ప్రజల హక్కుల కోసం పోరాటం చేశారని తెలిపారు. ఆమె మరణం విప్లవోద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు.Eluru Local News
సీతక్క ఆశయాలు, ప్రజా ఉద్యమాల కోసం ఆమె చేసిన పోరాటాన్ని స్మరించుకునేందుకు ఈ నెల 20న విజయవాడలో జరిగే సంతాప సభకు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో హమాలీ ముఠా కార్మిక సంఘం నాయకులు దూళ్ల వీరనాయుడు, రాజారావు, రంగారావు నాయుడు, హరితేష్, మణికంఠ, శ్రీను, రమణ, జయ, రాజు తదితరులు పాల్గొన్నారు.



