GUNTUR CITY NEWS: మలేరియా రహిత నగరంగా గుంటూరును తీర్చిదిద్దుదాం: కమిషనర్

Karthik
5 Views

ప్రపంచ మలేరియా దినోత్సవం (శనివారం) సందర్భంగా గుంటూరు నగర ప్రజలను సీజనల్, దోమకాటు వలన వ్యాప్తి చెందే వ్యాధుల నుండి కాపాడడానికి జిఎంసి ప్రజారోగ్య మలేరియా విభాగం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ మేరకు కృషి చేస్తుందని, మలేరియా నియంత్రణ మరియు నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుని భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా మలేరియా వ్యాధి లక్షణాలు, వ్యాప్తి విధానం మరియు నివారణ చర్యలపై ప్రజలకు విస్తృతస్థాయిలో అవగాహన కల్పించేందుకు పాఠశాలలు, కాలనీలు మరియు అపార్ట్‌మెంట్లలో జిఎంసి బయాలజిస్ట్ శేషయ్య నేతృత్వంలో ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దోమల నుండి నగర ప్రజలకు రక్షణ కల్పించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏఐ బేస్డ్ డ్రోన్ల ద్వారా దోమల లార్వాను అంతం చేసేందుకు శ్రీకారం చుట్టామని, నగరంలోని ప్రధాన జలాశయాల్లో డ్రోన్ల ద్వారా దోమల నివారణ మందుల పిచికారీ ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. దోమల పెరుగుదలను అరికట్టడమే మలేరియా నివారణకు ప్రధాన మార్గమని, నగర ప్రజలు తమ ఇళ్లలోని డ్రైన్లు, పూల కుండీలు, పాత టైర్లు, కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలని, వారానికి ఒకసారి తప్పనిసరిగా “డ్రై డే” పాటించాలని కోరారు. మున్సిపల్ మలేరియా సిబ్బంది ద్వారా ఇప్పటికే నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఫాగింగ్ మరియు యాంటీ లార్వల్ చర్యలు చేపట్టామని, ముఖ్యంగా హై-రిస్క్ ప్రాంతాలు, నిర్మాణ ప్రదేశాలు మరియు మురికివాడల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంటి స్థాయిలో ప్రతి ఒక్కరూ దోమతెరలు, రిపెలెంట్స్ వాడటంతో పాటు కిటికీలకు జాలీలు అమర్చుకోవడం ద్వారా దోమల కాటు నుండి రక్షణ పొందవచ్చని సూచించారు. నగరంలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత రక్త పరీక్షలు మరియు మలేరియా చికిత్స అందుబాటులో ఉన్నాయని, జ్వరంతో బాధపడుతున్న వారు వెంటనే సమీప కేంద్రాన్ని సంప్రదించాలన్నారు. మలేరియా కేసులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, అవసరమైన చోట ఎన్జీవోల సేవలను కూడా వినియోగించుకుంటున్నామని తెలిపారు. మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖ మరియు విద్యా సంస్థల సమన్వయంతో, ప్రజల సహకారంతో గుంటూరును మలేరియా రహిత నగరంగా మారుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Author
Share This Article
Leave a review