GUNTUR DISTRICT NEWS: సీలింగ్ భూములు క్రమబద్ధీకరణకు అవకాశం

Karthik

ఈ ఏడాది డిసెంబరు 31వ తేదీ లోగా దరఖాస్తులు సమర్పించాలిగుంటూరు, మే 1 : సీలింగ్ భూములు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. పట్టణ భూ పరిమితులు చట్టం, 1976 ప్రకారము ప్రభుత్వ పరిధిలోనికి వచ్చిన సీలింగ్ భూములు, మిగులు భూములు క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించిందని చెప్పారు. తమ ఆధీనములో ఉన్న భూములకు ప్రభుత్వం నిర్ణయించిన రుసుమును చెల్లించి క్రమబద్ధీకరించుకోవచ్చని తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువున, ఎగువున ఉన్న అందరు నిబంధనల మేరకు అర్హత కలిగి ఉంటారని తెలిపారు. సీలింగు భూములను క్రమబద్ధీకరించుకొనుటకు ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తూ 241 జి.ఓను జారీ చేసిందని చెప్పారు. ఈ ఉత్తర్వుల మేరకు సీలింగ్ భూములను క్రమబద్ధీకరించుకొనుటకు అర్హులైన వ్యక్తులు ఈ ఏడాది డిసెంబరు 31వ తేదీ లోగా జాయింట్ కలెక్టర్ మరియు కాంపిటెంట్ అధారిటీ, అర్బన్ ల్యాండ్ సిలింగ్స్, గుంటూరు వారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.క్రమబద్ధీకరణకు చెల్లించవలసిన మొత్తాన్ని రెండు దఫాలుగా – దరఖాస్తు సమయంలో 50 శాతం, ప్రభుత్వం అనుమతి యిచ్చిన తేదీ నుండి ఒక నెల గడువు లోపల మిగిలిన 50 శాతం చెల్లించాలని వివరించారు. 150 చదరపు గజముల వరకుఅన్ని అర్హతలు గల వారికి ఉచితంగా డి – పట్టా మంజూరు చేయడం జరుగుతుందని, 150 నుండి 300 చదరపు గజాల వరకు ప్రాథమిక (బేసిక్) విలువలో 15 శాతం చెల్లించాలని, 3 వందల నుండి 5 వందల చదరపు గజాల వరకు బేసిక్ విలువలో 30 శాతం, 5 వందల చదరపు గజాలకు పైబడి ఉంటే బేసిక్ విలువ శత శాతం చెల్లించాలని వివరించారు. క్రమబద్ధీకరించుకొను అర్హులకు కన్వేయన్స్ డీడ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. 2019 మే 1వ తేదీకి ముందు రిజిష్టర్ అయిన డాక్యుమెంట్ లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. క్రమబద్దీకరణ విలువ చెల్లించిన వారి భూములను వారి సొంత ఖర్చులతో వారి పేరున రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు అవకాశము కల్పించుటయేగాక ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా నుండి తొలగించుటకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. డి – పట్టా పొందిన వారికి, గతంలో 10 సంవత్సరాల తరువాత మాత్రమే బదలాయింపు చేసే అవకాశం ఉండేదని, ప్రస్తుతం 2 సంవత్సరాలకు బదలాయింపు చేసే అవకాశం ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు.

Author
Share This Article
Leave a review