Vijayawada Local News :పార్టీ బలోపేతమే లక్ష్యం.. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక- వసంత వెంకట కృష్ణప్రసాద్

Sharat
1 View

విజయవాడ రూరల్, జూలై 24 :– తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కార్యకర్తలే ప్రధాన బలమని, గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని మైలవరం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు.

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ కుటుంబ సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్టీ అభివృద్ధిలో కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని, వారే పార్టీకి నిజమైన వెన్నెముక అని పేర్కొన్నారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని, రానున్న పార్టీ కార్యక్రమాల్లో ప్రతి కార్యకర్త చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

గ్రామాలు, బూత్‌ల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా భావించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను ఇంటింటికీ వివరించి పార్టీపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచేలా పనిచేయాలని కోరారు.

పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉండి ప్రజాసేవనే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యల పరిష్కారంపై నాయకులు విస్తృతంగా చర్చించారు.

Author
Share This Article
Leave a review