పర్చూరు, ఆగస్టు 7:- పర్చూరు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో జల జీవన్ మిషన్ (జేజేఎం) పథకం కింద రూ.38.74 కోట్ల విలువైన 12 మంచినీటి పథకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక చొరవతో పర్చూరు, యద్దనపూడి, ఇంకొల్లు, చినగంజాం మండలాల్లోని గ్రామాలు, హాబిటేషన్లకు సింగిల్ విలేజ్ స్కీమ్లు (ఎస్వీఎస్), మల్టీ విలేజ్ స్కీమ్లు (ఎంవీఎస్) కింద నిధులు మంజూరయ్యాయి.
యద్దనపూడి మండలంలోని అనంతవరం జీపీ పరిధిలోని అనంతవరం హాబిటేషన్కు రూ.101.70 లక్షలు, సూరవరపుపల్లి హాబిటేషన్కు రూ.110.70 లక్షలు, యద్దనపూడి గ్రామ పంచాయతీకి రూ.263.70 లక్షలు, యనమదల జీపీలోని చింతపల్లిపాడు హాబిటేషన్కు రూ.139.50 లక్షలు కేటాయించారు.
పర్చూరు మండలంలో ఏబీ పాలెం సహా మరో 15 హాబిటేషన్లకు ఎంవీఎస్ పథకం కింద రూ.397.80 లక్షలు, ఇనగల్లు గ్రామ పంచాయతీకి రూ.146.70 లక్షలు, తన్నీరువారిపాలెం గ్రామ పంచాయతీకి రూ.81 లక్షలు, పర్చూరు గ్రామ పంచాయతీకి అత్యధికంగా రూ.1,041.25 లక్షలు మంజూరయ్యాయి.
ఇంకొల్లు మండలంలోని ఇంకొల్లు గ్రామ పంచాయతీ పరిధిలోని హాబిటేషన్కు రూ.994.33 లక్షలు కేటాయించారు.
చినగంజాం మండలంలో రాజుబంగారుపాలెం, పెద్దగంజాం సహా మరో 20 హాబిటేషన్లకు ఎంవీఎస్ పథకం కింద రూ.477 లక్షలు, పెద్దగంజాం గ్రామ పంచాయతీ పరిధిలోని కాటంవారిపాలెంకు రూ.61.65 లక్షలు, కొడూరివారిపాలెంకు రూ.58.95 లక్షలు మంజూరు చేశారు.
మొత్తంగా నియోజకవర్గంలో 12 మంచినీటి పథకాలకు రూ.3,874.28 లక్షలు (రూ.38.74 కోట్లు) మంజూరు కావడంతో వేలాది గ్రామీణ కుటుంబాలకు రక్షిత తాగునీటి సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈ పథకాల అమలుతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పూర్తిగా నివారించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించామని తెలిపారు. ఆమోదం పొందిన పనులను వేగంగా పూర్తి చేసి ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందేలా చర్యలు చేపడతామని చెప్పారు.



