గుంటూరులో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల (జిటిఎస్) ఏర్పాటు అత్యావశ్యకమని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. నగర పరిధిలో జిటిఎస్ నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు గోరంట్ల, ఆటో నగర్ ల్లోనిర్మాణ ప్రతిపాదిత ప్రాంతాలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, జిటిఎస్ ల నిర్మాణానికి ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు సమన్వయంతో పనిచేసి, స్థల కేటాయింపులకు సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలో చెత్త సేకరణ మరియు రవాణాను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిటిఎస్ లు దోహదపడతాయన్నారు. కాకాని రోడ్ లో ఆటోనగర్ ఇరువైపులా ఉన్నచెత్త, ఆక్రమణల తొలగింపును ఏపిఐఐసి, జిఎంసి ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులు జాయింట్ యాక్షన్ లో చేయాలన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ లోని మల్లికార్జున నగర్ లో రోడ్ నిర్మాణ పనులను పరిశీలించి, పనులు పూర్తీ అయిన వెంటనే బిల్ చెల్లింపు కోసం ప్రాసేస్ చేయాలని, జాప్యం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్లక్ష్యంగా ఉండే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పారిశుధ్య పనులను పరిశీలించి, క్షేత్ర స్థాయిలో శానిటేషన్ కార్యదర్శులు పారిశుధ్య పనుల పర్యవేక్షణలో తీవ్ర నిర్లక్ష్యంగా ఉంటున్నారన్నారు. ఇంటింటి చెత్త సేకరణ, డ్రైన్ల శుభ్రం, జివిబీలు లేకుండా చూడడంలో కార్యదర్శులను నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, ఇప్పటికే పలుమార్లు చెప్పినా పనితీరు మార్చుకొని వారిపై చర్యలకు సిఫార్స్ చేయాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ప్రధాన రోడ్ల వెంబడి తాటి ముంజలు, చెరుకు రసం స్టాల్స్ వారు వ్యర్ధాలను రోడ్ల పక్కన వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పర్యటనలో అదనపు కమిషనర్ (ఇంచార్జి) జి.సాంబశివరావు, డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, ఈఈ సుందర్రామిరెడ్డి, డిప్యూటీ సిటి ప్లానర్ సూరజ్ కుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, ఏసిపీ రెహ్మాన్, డిఈఈలు రమేష్ బాబు, సతీష్ కుమార్, ఏపిఐఐసి జోనల్ మేనేజర్ నరసింహారావు, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.



